అక్షరటుడే, వెబ్డెస్క్ : Non-Layout Plots | అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం ఉండడం లేదు.
తప్పనిసరిగా డీటీసీపీ అనుమతులు తీసుకోవాలని నిబంధన విధించింది. మరోవైపు నాన్ లే అవుట్ ప్లాట్లు (Non-Layout Plots) రిజిస్ట్రేషన్ చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. కానీ.. కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమార్జనకు అలవాటు పడి దర్జాగా నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (Registration Office) పరిధిలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు నిబంధనలు ఏమీ లెక్కచేయడం లేదు. నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సైతం చేసి పెడుతున్నారు. భూ భారతిలో (Bhu Bharati) ఉన్న భూమిని కేవలం నాలా పత్రం ఆధారంగా ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేసి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. నగరంలోని రోటరీ నగర్ (Rotary Nagar) సమీపంలో గల 12 గుంటల వ్యవసాయ భూమికి ఇటీవల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పెట్టారు. ఓ సర్వే నంబర్లో పట్టాదారుకు భూ భారతిలో 12 గుంటల భూమి ఉండగా.. కేవలం నాలా పత్రాల సాయంలో ఏడు ప్లాట్లుగా విభజించారు. 8585, 8586, 8578, 8579 నంబర్లతో కలిగిన డాక్యుమెంట్లను అక్టోబర్ 10న పూర్తి చేశారు.
Non-Layout Plots | కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ లే అవుట్లకు సంబంధించి దర్జాగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నిజామాబాద్లో (Nizamabad) డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇరువురు అధికారులు ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా నాన్ లే అవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
