అక్షరటుడే, వెబ్డెస్క్: Recovery agents | ఫైనాన్స్ సంస్థల రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రుణగ్రహీతల నుంచి వాయిదాలు వసూలు చేయడానికి వెళ్లి హంగామా చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే పరువు తీస్తున్నారు. ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు (Finance Companies) ప్రజలకు అవసరం లేకున్నా.. ఫోన్లు చేసి లోన్లు అంటగడుతున్నాయి. అనంతరం వాటి వసూలు కోసం రౌడీలను రంగంలోకి దింపుతున్నాయి.
మొదటగా మంచిగా మాట్లాడి లోన్లు ఇస్తున్న బ్యాంకులు (Banks), ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం అయితే చాలు ఏజెంట్లను(Recovery agents) పంపి హడావుడి చేస్తున్నాయి. ఇటీవల పుట్టగొడుగుల్ల ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులు వచ్చి మీకు లోన్ కావాలా సార్ అంటూ ప్రజలకు ఆశ చూపుతున్నారు. ఇల్లు, కారులోన్లు ఇస్తున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత.. ఏదైనా ఇబ్బందులతో కట్టడం ఆలస్యం అయితే పరువు తీస్తున్నారు.
Recovery agents | నడిరోడ్డుపై దింపేశారు..
ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) నగరంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని కుటుంబంతో సహా నడి రోడ్డుపై దింపి కారు తీసుకొని వెళ్లిపోయారు. ఓ వ్యక్తి కారు లోన్ తీసుకున్నాడు. ఆయన నిజాంపేట నుంచి విజయవాడకు కుటుంబ సభ్యులతో బయలు దేరాడు. అయితే అబ్దుల్లాపూర్మెట్ (Abdullapurmet) వద్ద ఆయనను రికవరీ ఏజెంట్లు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్తున్నానని.. వచ్చాక డబ్బులు కడతానని చెప్పినా ఏజెంట్లు వినిపించుకోలేదు. రోడ్డుపై పరువు తీయొద్దని బతిమిలాడినా వినకుండా కుటుంబాన్ని మొత్తం రోడ్డుపై దించేసి కారు లాక్కొని వెళ్లిపోయారు.
Recovery agents | రౌడీ షీటర్లు.. పాత నేరస్తులు..
సాధారణంగా కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి సదరు వ్యక్తి నేర చరిత్ర ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాయి. నేర చరిత్ర ఉంటే జాబ్లోకి తీసుకోరు. కానీ ఫైనాన్స్ సంస్థలు మాత్రం రికవరీ ఏజెంట్లుగా రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బౌన్సర్లను నియమించుకుంటున్నాయి. పెండింగ్ ఈఎంఐలు(EMI) వసూలు చేస్తే కమీషన్ ఇస్తామని వీరికి చెబుతున్నాయి. దీంతో వీరు అనుచరులతో కలిసి రుణ గ్రహీతల ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నానా రచ్చ చేస్తున్నారు. ఈఎంఐ కట్టడం వారం ఆలస్యమైనా బెదిరింపులకు దిగుతున్నారని, పరువు తీస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.