Homeతాజావార్తలుMaoists | ఆయుధాలు వీడేందుకు సిద్ధం.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoists | ఆయుధాలు వీడేందుకు సిద్ధం.. మావోయిస్టుల సంచలన లేఖ

ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్ట్​ పార్టీ లేఖ రాసింది. కూంబింగ్​ ఆపేస్తే ఆయుధాలు వీడుతామని ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు (Maoists) సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. కూంబింగ్​ ఆపేస్తే తాము ఆయుధ విరమణ తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు.

తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్ట్​ పార్టీ (Maoist Party) లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో వెల్లడింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంకు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేసింది.

Maoists | ఆపరేషన్​ కగార్​తో..

ఆపరేషన్​ కగార్​తో​ (Operation Kagar) మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. పక్కా సమాచారం కూంబింగ్​ చేపడుతూ.. కీలక నేతలను సైతం ఎన్​కౌంటర్​ చేస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఇందులో పార్టీ అగ్రనేత, కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు మేలో మృతి చెందారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్​కౌంటర్లలో మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్​ శంకర్​ చనిపోయారు. ఎన్​కౌంటర్లలో కీలక నేతలు, కేడర్​ చనిపోతుండడంతో చాలా మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం.

Maoists | జోనల్​ కమిటీలకు సమాచారం

కూంబింగ్ ఆపరేషన్ (Coombing Operation) నిలిపివేస్తే ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని తెలిపింది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్​ కమిటీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది. అయితే ఆపరేషన్​ కగార్​ ఆపడం అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.