అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Dealers | రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు (Ration Dealers) ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రాల్లో సోమవారం నిరసన తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు కోరారు. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి రేషన్ (Ration) పంపిణీని బహిష్కరిస్తామన్నారు. ఐదు నెలలుగా కమీషన్ (Commission) రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ కమీషన్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు నెలకు గౌరవ వేతనం రూ.5వేలు ఇవ్వాలని కోరారు. నెలకు రూ.35 కోట్ల చొప్పున రూ.175 కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు.
Ration Dealers | హామీలు అమలు చేయాలి
ఐదు నెలల కమీషన్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రేషన్ డీలర్లు వాపోయారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో నిరసన (Protest) తెలిపి కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Ration Dealers | దొడ్డు బియ్యం వాపస్ తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం అలాగే ఉండిపోయింది. 5 నెలలుగా దొడ్డు బియ్యాన్ని వాపస్ తీసుకోకపోవడంతో ముక్కి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.