అక్షరటుడే, వెబ్డెస్క్: BJP State President | బీజేపీ రాష్ట్ర సారథి ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్ రావు (Naraparaju Ramchandra Rao) కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జి శోభా కరంద్లాజే (in-charge Shobha Karandlaje) ప్రకటించారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏక్రగీవమైందని ఆమె తెలిపారు. హైదరాబాద్ మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాంచందర్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు పార్టీ ఎన్నికల ఇన్చార్జి శోభా కరంద్లాజే నియామక పత్రాన్ని అందజేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్రావుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) పార్టీ జెండాను అందించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆయనను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay), డీకే అరుణ (DK Aruna) తదితరులు ఘనంగా సత్కరించారు.
BJP State President | చిన్నప్పటి నుంచే ..
ఎన్.రాంచందర్ రావు (N.Ramchandra Rao) చిన్నప్పటి నుంచి కాషాయ దళం నీడలోనే పెరిగారు. ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. విద్యార్థి దశలో రాడికల్స్కు ఎదురొడ్డి పోరాడిన ఆయన.. రైల్వే డిగ్రీ కాలేజీలో (Railway Degree College) మూడేళ్లపాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రాంచందర్రావు అందులో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో (Osmania University library) ఉన్న సమయంలో నక్సలైట్లు వచ్చి ఆయనపై దాడి చేశారు. రెండు నెలలపాటు మంచానికే పరిమితమైన రాంచందర్రావు ఆ తరువాత రాడికల్స్కు వ్యతిరేకంగా ఉధృతంగా పోరాటాలు చేశారు. ఓవైపు ఉద్యమాలు చేస్తూనే ఎంఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1986లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించిన రాంచందర్రావు.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రైబ్యునళ్లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసులను వాదిస్తుంటారు.
BJP State President | కార్పొరేటర్గా ప్రస్థానం ప్రారంభం..
రాంచందర్రావు రాజకీయ ప్రస్థానం జీహెచ్ఎంసీ కార్పొరేటర్(GHMC corporator)గా ప్రారంభమైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1986లో బీజేపీ తరఫున రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 2021 వరకు బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. బీజేపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా (BJP Hyderabad president) కూడా పనిచేశారు. మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దశాబ్దాల తరబడి ఒకే పార్టీలో ఉంటూ బీజేపీకి విధేయంగా పని చేశారు. పార్టీలో వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కింది నుంచి పై స్థాయి వరకూ అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను మెచ్చిన అధిష్టానం ఆయనకు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది.
BJP State President | బీజేపీని విమర్శించే హక్కు లేదు..
దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్న బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్కు కానీ, బీఆర్ ఎస్కు కానీ లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో ని ప్రభుత్వం దేశ సంక్షేమం కోసం, దేశ ప్రజల కోసం పని చేస్తుందన్నారు. 11 ఏళ్లలో ఒక్క రూపాయి అవినీతి జరుగకుండా ధర్మకర్తగా, సమర్థవంతమైన నరేంద్ర మోదీ సర్కారును (Narendra Modi government) విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీని (BJP) విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు (BRS), కాంగ్రెస్ పార్టీకి (Congress Party) లేదని స్పష్టం చేశారు.