అక్షరటుడే, వెబ్డెస్క్: Raja Singh resign | బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పార్టీలో ముసలం పుట్టించింది. అధ్యక్ష పదవిని ఎన్.రాంచందర్రావుకు (N.Ranchandra Rao) కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు తలో విధంగా స్పందిస్తున్నారు. పార్టీకి రాజీనామా (resign) చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి రాజీనామా లేఖ సమర్పించారు.
Raja Singh resign | నాకు అన్యాయం జరిగింది
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. పార్టీ కోసం నా సర్వస్వం త్యాగం చేశానని పేర్కొన్నారు. టెర్రరిస్టులకు సైతం తాను టార్గెట్ అయ్యానన్నారు. నేనే కాదు నా ఫ్యామిలీ కూడా టార్గెట్ అయ్యిందన్నారు. ఇంత చేసినా తనకు అన్యాయమే జరిగిందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నిర్ణయం ముందే తీసుకున్నారని.. కేవలం నామ మాత్రంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాంచందర్రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై తాను అసంతృప్తి చెందానన్నారు. కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
Raja Singh resign | నామినేషన్ వేయనివ్వలేదు
నేను బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. నన్ను పది మంది బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉండగా.. నేను వారిని తీసుకుని వచ్చానన్నారు. కానీ నాయకులను బెదిరించారని చెప్పారు.
Raja Singh resign | ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ వ్యాఖ్యానించారు. కిషన్రెడ్డికి రాజీనామా లేఖ అందజేశానని చెప్పారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరానని చెప్పారు. తాను ఇక బీజేపీ సభ్యుడిని కాదని అసెంబ్లీ స్పీకర్కు తెలపాలని కిషన్ రెడ్డికి తెలిపానని చెప్పారు. బీజేపీతో తనకు సంబంధం లేదన్నారు. పార్టీకి రాజీనామా చేసినా కూడా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.