HomeUncategorizedHeavy Rains | ఉత్తరాదిలో వర్షబీభత్సం.. పలువురి మృతి

Heavy Rains | ఉత్తరాదిలో వర్షబీభత్సం.. పలువురి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | ఉత్తర భారత దేశం (North India)లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండంతో భయంభయంగా కాలం వెల్లదీస్తున్నారు.

జమ్మూ కశ్మీర్​, హిమాచల్ ప్రదేశ్​, అరుణాచల్ ప్రదేశ్​, రాజస్థాన్​, పంజాబ్​, హర్యానాలో భారీ వర్షాలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో క్లౌడ్​ బరస్ట్​ అవుతుండటంతో వరద ముంచెత్తుతోంది. ఆయా రాష్ట్రాల్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి.

Heavy Rains | నలుగురి మృతి

జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని దోడా ప్రాంతంలో మంగళవారం క్లౌడ్​ బరస్ట్ (Cloudburst)​ అయింది. దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తి నలుగురు చనిపోయారు. ఆ రాష్ట్రంలోని కథువా, కిష్త్వార్‌లలో ఇటీవల క్లౌడ్​ బరస్ట్​ కాగా పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దోడాలో ఊహించని విధంగా కురిసిన భారీ వర్షం వల్ల ఆకస్మిక వరదలు సంభవించి పదికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

Heavy Rains | విరిగిపడిన కొండచరియలు

శ్రీనగర్‌-లడఖ్‌ మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. జోజిలా పాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh) పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో సైతం కొండ చరియలు విరిగి పడ్డాయి. బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Heavy Rains | ఉధృతంగా పారుతున్న నదులు

జమ్మూ కశ్మీర్​లో భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రావి, బియాస్​, సట్లేజ్​, చినాబ్​ నదులు ఉగ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. బాగ్లిహర్​ పవర్​, సలాల్​ ప్రాజెక్ట్​ల గేట్లను అధికారులు ఎత్తారు.