అక్షరటుడే, హైదరాబాద్: Rains Alert | రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో (Hyderabad) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) నుంచి ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Rains Alert | 2 గంటల్లో 42 సెం.మీ. వర్షం పడడం వల్లే నష్టం
24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునే విధంగా పట్టణాలు నిర్మితమై ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటిది క్లౌడ్ బరస్ట్ సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. గతంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడడంతో నష్టం జరిగిందని చెప్పారు.
విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలన్నారు. నిధులకు కొరత లేదని.. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
Rains Alert | విద్యాసంస్థలకు సెలవు..!
పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి (Ranga Reddy) లాంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం (work from home) నిర్వహించుకునేలా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (IT Special Chief Secretary) సమన్వయం చేయాలని చెప్పారు.
వీలైనంత వరకు ప్రజలను రోడ్లపైకి రాకుండా అప్రమత్తం చేయాలని సూచించారు. హైడ్రా(Hydraa) తరఫున ఎఫ్ఎం రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే సమాచారం ఇచ్చే సంస్థలకు వెనువెంటనే వాస్తవాలను వెల్లడించాలని చెప్పారు.
నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. జోనల్ కమిషనర్లను అప్రమత్తమై అలాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
హైడ్రా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో 2 వేల మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. సహాయక చర్యల కోసం ఎక్కడ అవసరమైతే వారిని అక్కడికి తరలించాలన్నారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం పునరుద్దరణ పనులు చేపట్టాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్స్ను సమకూర్చాలని పేర్కొన్నారు. విద్యుత్కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా, అలాగే పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైన మెడిసిన్స్, సౌకర్యాలను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.
ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందో ఆ ప్రాంతాల్లో సమన్వయం కోసం కలెక్టర్లు అదనంగా అధికారులను నియమించుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ముసీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రమాద స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలి.
ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటి పారుదల శాఖ అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నీటి విడుదలపై పూర్తి సమాచారం ఇవ్వాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మా శాఖకు సంబంధం లేదని ఏ విభాగం చెప్పడానికి వీలులేదు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను క్రియేట్ చేసుకుని సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కొందరు సీనియర్ ఆఫీసర్లను డిప్యూట్ చేసుకోవాలి.
వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొన్నారు.