అక్షరటుడే, వెబ్డెస్క్ : Vishakapatnam | ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే విశాఖపట్నం వైపు ఐటీ దిగ్గజాలు మొగ్గుచూపుతుండగా, తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ వచ్చేఅవకాశం కనిపిస్తోంది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ ఎల్ఎల్(Google LLC)సీ కు అనుబంధంగా పనిచేస్తున్న రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, విశాఖలో భారీ స్థాయి ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది.
Vishakapatnam | రూ.87,250 కోట్ల పెట్టుబడి – 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ(Raiden Infotech Company) రూ.87,250 కోట్ల భారీ పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక డేటా సెంటర్ను స్థాపించేందుకు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రాజెక్ట్ తొలి దశను రెండేళ్లన్నరలో పూర్తిచేయాలని, 2028 జూలై నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలోని రాంబిల్లి–అచ్యుతాపురం, అడవివరం, తర్లువాడ క్లస్టర్లలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం మొత్తం 480 ఎకరాల భూమిని ప్రభుత్వాన్ని కోరింది
రాంబిల్లి అచ్యుతాపురంలో – 160 ఎకరాలు, అడవివరంలో – 120 ఎకరాలు. తర్లువాడలో – 200 ఎకరాలు..మొత్తం ప్రాజెక్టుకు 2,100 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సంస్థ పేర్కొంది. అయితే దీనిని విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు తెలిపింది. తర్లువాడలోని దానికి 929 మెగావాట్లు, రాంబిల్లిలోని డేటా సెంటర్కు 697 మెగావాట్లు, అడవివరంలోని డేటా సెంటర్కు 465 మెగావాట్లు విద్యుత్ అవసరం అవుతుందని సంస్థ చెప్పుకొచ్చింది. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వ(AP Government) ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు . సంస్థకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, విద్యుత్ సరఫరా, భూస్వాధీన అంశాలపై సమీక్ష కొనసాగుతోంది. అధికార వర్గాలు ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం (Vishakapatnam) ఐటీ రంగంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాయి.
రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ కంపెనీ సింగపూర్కు చెందిన సంస్థ. ఇది అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ భారతదేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కావలసిన పెట్టుబడులు, సాంకేతిక మౌలిక వసతులు అందిస్తోంది. రైడెన్ సంస్థ నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్గా నమోదు అయింది. అంటే, దీని షేర్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.ఇక ఇప్పటికే గూగుల్ సంస్థ రూ.52,000 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో నిర్మిస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరగనుంది. అలాగే సిఫీ సంస్థ రూ.16,000 కోట్లతో డేటా సెంటర్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో రైడెన్ ఇన్ఫోటెక్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతాన్ని భారతదేశ డేటా సెంటర్ హబ్గా మార్చబోతోంది.