అక్షరటుడే, ఇందూరు: Ramchandra Rao | కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (BJP state president Ramchandra Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రెయిన్ చోరీ అయిందని.. అందుకే ఓటు చోరీ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని.. యావత్ ప్రజానీకం మోదీ వెంటే ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల (booth-level workers) సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) కాంగ్రెస్కు ఓటమి ఖాయమన్నారు. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం సిగ్గుచేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఓటమి చెందుతుందని అర్థమయ్యే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అనేక పథకాల్లో కేంద్ర వాటా ఉందని విషయాన్ని ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. తొందరలోనే భారీ మార్పు కనిపిస్తుందని తెలిపారు.
Ramchandra Rao | పార్టీకి కార్యకర్తలే సంపద
పార్టీలో కొత్తవారికి అవకాశం ఉంటుందని.. యువత మహిళలు పెద్ద ఎత్తున చేరాలని రాం చందర్ రావు అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు (Nizamabad Parliament) అంటేనే బీజేపీకి తిరుగులేని స్థానమన్నారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూస్తే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. పార్టీకి కార్యకర్తలే సంపద అని.. అటువంటి సంపదను ఎంపీ ధర్మపురి అర్వింద్ పూర్తి శాతం పోగుచేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు.
Ramchandra Rao | రాష్ట్ర నాయకత్వంలో జిల్లా వారికి చోటు కల్పించాలి
రాష్ట్ర నాయకత్వంలో తన పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలకు చోటు కల్పించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) కోరారు. ఎక్కడైతే పార్టీకి బలం ఉంటుందో అక్కడ పదవులు కచ్చితంగా ఇవ్వాలన్నారు. పార్టీని అభివృద్ధి చేసే బాధ్యత, కొత్తవారికి అవకాశం ఇచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయాలని.. తామంతా వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికీ రాష్ట్ర జిల్లా కమిటీలో సీనియర్లకే పదవులు ఇస్తున్నారంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తవారికి అవకాశం కల్పించాలన్నారు. పార్టీ ఎదుగుదలను అడ్డుకునే వారికి తాను ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతానని పేర్కొన్నారు. రాకేశ్ రెడ్డి బీజేపీ చేరేసమయంలో పార్టీలోని కొందరు పెద్దలు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. అనవసర పుకార్లు పుట్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం (party high command) దృష్టిగా తీసుకెళ్లి.. రాకేశ్ రెడ్డి చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు. పుకార్లు సృష్టించిన నేతలే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు.
ఇక మున్సిపల్, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను జిల్లా నుంచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు లోక భూపతిరెడ్డి, పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Ramchandra Rao | చెక్కుల పంపిణీ..
ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలకు చెక్కులను పంపిణీ చేశారు. నూతన గృహప్రవేశాలు చేసిన వారికి, అనారోగ్యం పాలైన వారికి చెక్కులను అందజేశారు. అలాగే జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించారు.