అక్షరటుడే, వెబ్డెస్క్: Diwali | దేశమంతా దీపావళి (Diwali) వేడుకలతో కళకళలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా ఈ పండుగకు దూరంగా ఉంది.
పండుగ రోజు ఊరంతా చీకటిలో ఉండిపోతుంది. దీనికి వెనుక ఒక విషాదకథ ఉంది. వివరాల ప్రకారం, సుమారు 200 సంవత్సరాల క్రితం, పున్నానపాలెం గ్రామంలో దీపావళి రోజున అనూహ్య దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అదే రోజున గ్రామానికి చెందిన మరో రైతు ఇంట్లో రెండు ఎద్దులు కూడా మృతిచెందాయి. ఈ వరుస విషాదాలు గ్రామస్థులలో తీవ్రమైన భయం, కలత కలిగించాయి.
Diwali | అసలు విషయం ఇది..
ఈ ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన గ్రామ పెద్దలు దీపావళి పండుగ తమ ఊరుకు అచ్చిరాలేదని భావించి, భవిష్యత్తులో ఇలాంటి అపశకునాలు పునరావృతం కాకుండా గ్రామంలో ఎవరూ దీపావళి జరపకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ రోజు నుంచి పండుగను జరుపకపోవడం గ్రామంలో ఆచారంగా మారింది. పూర్వీకుల నిర్ణయాన్ని తరాలు మారినా గ్రామస్తులు గౌరవిస్తూ కొనసాగిస్తున్నారు. దీపాలు అలంకరించడం, టపాసులు (Crackers) కాల్చడం వంటి దృశ్యాలు పున్నానపాలెంలో ఈ రోజు చూడలేము. దీపావళి రోజున ఊరు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. స్థానికులు, పూర్వీకుల ఆచారాన్ని గౌరవించడం గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు.