అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Narendra Modi | మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం స్థాపకుడు ప్రవక్త ముహమ్మద్ జయంతి సందర్భంగా మోదీ ‘X’లో ఓ పొస్టు పెట్టారు.
“పవిత్రమైన ఈ రోజు మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలి. కరుణ, సేవ, న్యాయం విలువలు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాయి. ఈద్ ముబారక్!” (Eid Mubarak) అని పోస్టులో పేర్కొన్నారు. ఈద్ శుభాకాంక్షలతో పాటు భారతదేశ రెండో రాష్ట్రపతి, విశిష్ట ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యువ మనస్సులను పెంపొందించడంలో వారి పాత్ర బలమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది వేస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అంకితభావాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. వ్యక్తులను, సమాజాన్ని మెరుగ్గా రూపొందించడంలో ఉపాధ్యాయుల నిబద్ధత, కరుణ అమూల్యమైనవన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ జీవితం, ఆలోచనలు ఆదర్శనీయమని, విద్య, తత్వశాస్త్రానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకోవాలని సూచించారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యార్థుల జీవితాలను రూపొందించడంలో ఉపాధ్యాయులు పోషించే పాత్రకు అంకితమైన రోజుగా భావిస్తారు. 1888 సెప్టెంబర్ 5న జన్మించిన భారతరత్న గ్రహీత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని స్మరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.