అక్షరటుడే, వెబ్డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు ఆహ్వానం అందింది. కెనడా ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ మోదీని ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడా వేదికగా జీ-7 సమ్మిట్ (G-7 Summit) జరగనుంది. ఈ సందర్భంగా మోదీ కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు.
G–7 కూటమిలో కెనడాతో పాటు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉన్నాయి. అయితే జీ–7 కూటమిలో భారత్ లేకున్నా.. ఆధిత్య దేశాల ఆహ్వానం మేరకు పాల్గొనవచ్చు. ఈ క్రమంలో కెనడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారు.
G-7 Summit | ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..
జీ–7 శిఖరాగ్ర సమావేశానికి తనను ఆహ్వానించడంపై మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సమావేశానికి తాను హాజరవుతానని, కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark carny) ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా జీ–7 సదస్సు జూన్ 15-17 మధ్య కననస్కిస్లో జరగనుంది. ‘‘కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నుంచి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల విజయంపై ఆయనను అభినందించాను. జీ –7 సమావేశానికి ఆహ్వానం పంపినందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు.
G-7 Summit | అంతలో ఎంత మార్పు..
కెనడా ప్రధానిగా గతంలో జస్టిన్ ట్రూడో (Justin Trudo) ఉండేవారు. ఆయన హయాంలో భారత్, కెనడా సంబంధాలు క్షీణించాయి. కెనడాలో ఖలిస్థాని వేర్పాటు వాదులను గుర్తు తెలియని వ్యక్తులు హతమారిస్తే భారతే చేయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని తీరును భారత్ ఎండగట్టింది. ట్రూడోకు స్వదేశంలో కూడా వ్యతిరేకత రావడంతో పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ ప్రధానిగా ఎన్నిక అయ్యారు.
అనంతరం మోదీకి జీ–7 దేశాల్లో పాల్గొనడానికి ఆహ్వానం పంపారు. దీనిని బట్టి ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం చేయడం కోసం ఆయన యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, కెనడా ప్రధానితో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.