అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Narendra Modi | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్కు దూరమయ్యామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇప్పుడు సంబంధాల పునరుద్ధరణకు సిద్ధమని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) స్వాగతించారు. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. “అధ్యక్షుడు ట్రంప్ భావాలను, మా సంబంధాలపై సానుకూల అంచనాను లోతుగా అభినందిస్తున్నాను. భారతదేశం, అమెరికా చాలా సానుకూలంగా, భవిష్యత్తుతో కూడిన సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ప్రధాన మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు.
అమెరికా-భారత్ సంబంధాల స్థితిగతులపై ట్రంప్ వైఖరి ఒక్కసారిగా మారింది. వాణిజ్య యుద్ధంతో భారత్, అమెరికా(America) మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో భారత్కు దూరమయ్యామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కానీ గంటల వ్యవధిలోనే ఆయన మాట మార్చారు. ప్రధాని మోదీతో తన దీర్ఘకాల స్నేహాన్ని ఆయన పునరుద్ఘాటించారు, ఆయనను “గొప్ప ప్రధాన మంత్రి”గా అభివర్ణించారు. *భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. భారత్(India)తో దశాబ్దాలుగా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్.. వాటిని పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడు, గొప్ప ప్రధాని అని, అయితే, ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదన్నారు. అందుకే 50 శాతం టారిఫ్ విధించానని చెప్పారు. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు.
మోదీ ఇటీవల వైట్ హౌస్(White House) సందర్శనకు వచ్చారని, రోజ్ గార్డెన్లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “నేను (భారత ప్రధాని) మోదీతో చాలా బాగా కలిసిపోతాను, మీకు తెలిసినట్లుగా, ఆయన రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్నారు, మేము రోజ్ గార్డెన్కు వెళ్లాము… మేము ఒక వార్తా సమావేశం నిర్వహించాము…” అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధం చెక్కుచెదరకుండా ఉందని పేర్కొన్నారు.