అక్షరటుడే, వెబ్డెస్క్ : India – Russia | రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US Persident Trump) ఓ వైపు భారత్పై సుంకాలు విధిస్తున్నారు. మరోవైపు భారత్ రష్యాతో సంబంధాలను మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు. పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక అజెండా, ఉక్రెయిన్ ఘర్షణలపై మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్ ఘర్షణలపై పుతిన్ వివరించినట్లు మోదీ పేర్కొన్నారు. ‘‘ నా స్నేహితుడు పుతిన్తో చాలా మంచి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్పై తాజా పరిణామాలను పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. మా ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిని కూడా మేము సమీక్షించాము. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో అధ్యక్షుడు పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు.
India – Russia | కీలక ఒప్పందాలు
రష్యాతో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది. ముడి చమురు, ఆయుధాల కొనుగోళ్ల సంబంధించి చర్చించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajith Doval) ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివరలో పుతిన్ భారత్ వస్తారని ఆయన పేర్కొన్నారు. తాజాగా మోదీ సైతం పుతిన్ పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కాగా రష్యా –ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనే ట్రంప్ భారత్పై సుంకాలు విధించారు. తాజాగా పుతిన్, మోదీ ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చించడం గమనార్హం.
India – Russia | నాలుగేళ్ల తర్వాత..
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో 2021లో చివరిసారి పర్యటించారు. డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన 21వ భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ గత ఏడాది రెండు సార్లు రష్యాలో పర్యటించారు. జూలైలో 22వ రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశంలో, అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా పుతిన్ భారత్ రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత రెండు దేశాలు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నారు.
