అక్షరటుడే, వెబ్డెస్క్ : Justice Suryakant | సుప్రీంకోర్టు (Supreme Court) తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ (BR Gavai) నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సీజేఐ (CJI)గా సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. తాజాగా ఆయన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ఆమోదం తెలిపారు.
రాష్ట్రపతి ఆమోదంతో సూర్యకాంత్ నియామకానికి అవసరమైన ప్రక్రియ పూర్తయ్యింది. 53వ సీజేఐగా సూర్యకాంత్ నియామకానికి సంబంధించిన కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 24న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9వరకు సూర్యకాంత్ పదవిలో కొనసాగుతారు.
Justice Suryakant | హర్యానా నుంచి తొలి వ్యక్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు హర్యానా (Haryana) నుంచి ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. తొలి వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు. కాగా జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1981లో అక్కడి ప్రభుత్వ పోస్ట్గ్రాడ్యుయేట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పట్టా పొందారు. 38 సంవత్సరాల వయస్సులో హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా పని చేశారు.
జస్టిస్ సూర్యకాంత్ 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జడ్జిగా పని చేస్తూ కూడా ఆయన తన చదువు కొనసాగించడం గమనార్హం. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి తన మాస్టర్ ఆఫ్ లాలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సాధించారు.14 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జి (Supreme Court Judge)గా పదోన్నతి పొందారు. తాజాగా 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

