అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ (SIT) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించారు. ప్రధాన నిందితుడు ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావును సైతం పలుమార్లు విచారించారు. అయితే ఆయన అధికారులకు సహకరించడం లేదు. మరో నిందితుడు ప్రణీత్రావును సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు బయట పడటంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. కోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడంతోనే ఆయన ఇండియాకు వచ్చారు.
Phone Tapping | అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు ఆశ్రయించారు. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్లో ఆధారాలు ధ్వంసం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. FSL రిపోర్ట్ లో తేదీలతో సహా ఉంది, మొత్తం డేటాను రీసెట్ చేశారని తెలిపారు.
ప్రభాకర్రావు జడ్జీలు,రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ల ఫోన్లను ట్యాపింగ్ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. అయితే కోర్టు ఆయన అరెస్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా చూడాలి. ఒకవేళ ప్రభాకర్రావు అరెస్ట్కు ఆమోదం తెలిపితే.. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.