అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | పోలీసుల నుంచి జరిమానాలు తప్పించుకునేందుకు ఫేక్ నంబర్ ప్లేట్ బిగించుకున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నరహరి (CI Narahari) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని వినాయక నగర్కు చెందిన చెరువుపల్లి రాహుల్ రాజ్ అనే వ్యక్తి తన స్కూటీ కొనుగోలు చేశాడు. దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి స్కూటీని కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాహుల్ రాజ్ స్కూటీ నెంబర్ ప్లేట్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫైన్లు ఉంటే రాహుల్ రాజ్కు పడతాయి. దీంతో ఈ వ్యక్తి తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో తిరుగుతుండగా పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నా.. నంబర్ ప్లేట్లు లేకున్నా తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.