అక్షరటుడే, వెబ్డెస్క్ : Nandipet | వ్యభిచార దందా నిర్వహిస్తున్న తమను పట్టించాడని పగ పెంచుకున్న కొందరు ఓ వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఏడాది జనవరిలో నందిపేట మండలం లక్కంపల్లి (Lakkampalli) శివారు ప్రాంతంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు విటులను పట్టుకున్నారు. 8 మంది మహిళలను రక్షించారు. దీనిపై నందిపేట పోలీస్ స్టేషన్ (Nandipet Police Station)లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు నమోదు కావడానికి లక్కంపల్లి గ్రామంలోని భరత్నగర్కు చెందిన మేకల మహేశ్ కారణమని మేకల ప్రకాశ్ పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో పలుమార్లు మహేశ్తో గొడవ పడ్డాడు. చంపుతానని బెదిరించాడు. అనంతరం ఆయనకు పరిచయమైన ఓ మహిళ, నర్సయ్య అలియాస్ పెయింటర్ దేవాతో కలిసి ప్రకాశ్ మేకల మహేశ్ను చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డులను బాధితుడు మహేశ్ పోలీసులకు అప్పగించి శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు.
