అక్షరటుడే, హైదరాబాద్: phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు కాస్త సమయం ఇవ్వాలనే భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థనకు సిట్ స్వీకరించింది. విచారణకు హాజరయ్యే విషయంలో ఆయనకు టైం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. సమయం కావాలని కేసీఆర్ రాసిన లేఖపై స్పందించిన సిట్.. ఇందుకు సంబంధించి రిప్లై ఇచ్చింది.
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (జనవరి 30న) విచారణకు అటెండ్ కావాలని కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో గురువారం (జనవరి 29) సిట్ అధికారులు సీఆర్ పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వయసును పరిగణనలోకి తీసుకున్న సిట్.. ఆయన కోరుకున్న స్థలంలోనే విచారణ చేపడతామని ఉత్తర్వులో పేర్కొంది.
phone tapping case | ఇకపై ఆ అడ్రస్కే..
సిట్ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. జనవరి 30న విచారణకు హాజరుకాలేనని సిట్కు లేఖ పంపారు. విచారణకు అటెండ్ అయ్యేందుకు కాస్త సమయం కావాలని సిట్ను కోరారు. మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో పోలింగ్ తర్వాత విచారించాలని విన్నవించారు.
మరో తేదీలో తన ఫామ్ హౌస్లో విచారించాలని సిట్కు పంపిన లేఖలో కేసీఆర్ కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఇకపై ఏ నోటీసైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పంపించాలన్నారు. కేసీఆర్ అభ్యర్ధనపై సిట్ సానుకూలంగా స్పందించింది. సమయం ఇచ్చేందుకు అంగీకరించింది. కొత్త తేదీని త్వరలోనే చెబుతామని పేర్కొంది.