అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఎడతెరపి లేకుండా వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే ఎడతెరపి వాన పడింది. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీతారాంనగర్ కాలనీలో ఇళ్లల్లోకి నీరు చేరాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ (Sriramsagar), నిజాంసాగర్ (Nizamsagar) జలాశయాలు జల కళను సంతరించుకుంటున్నాయి.

Heavy Rains : అధికారుల అప్రమత్తం..
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ (Sriramsagar) పరివాహక ప్రాంతంతో పాటు నదులు, వాగులు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) హెచ్చరికలు జారీ చేశారు.
అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని కలెక్టర్ సూచించారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు జలాశయాల వద్దకు వెళ్ళొద్దని స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు, అప్రమత్తంగా ఉంటూ తక్షణ పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రమాదం ఎదురైనా.. అత్యవసర పరిస్థితులు ఏర్పడినా కలెక్టరేట్(collectorate)లోని కంట్రోల్ రూమ్ కు 08462 – 2201832 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
