అక్షరటుడే, వెబ్డెస్క్:Mahanadu 2025 | కడప(Kadapa)లో మూడో రోజు టీడీపీ మహానాడు కొనసాగింది. చివరి రోజైన బుధవారం టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తనకు అన్నతో సమానమని లోకేశ్ అన్నారు. జెండాలు, అజెండాలు పక్కనపెట్టి తమ కోసం పని చేశారన్నారు. పార్టీలో సీనియర్లను, జూనియర్లను గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. పని చేసేవారిని ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు.
కొందరు టీడీపీ జెండా పీకేస్తామన్నారని, ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలు మూసేసుకుంటున్నారని వైసీపీ(YCP)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019 నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
Mahanadu 2025 | తెలుగు దేశం అడ్డా కడప : చంద్రబాబు
మహానాడులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. కడప తెలుగు దేశం పార్టీ(Telugu Desham Party) అడ్డా అని నిరూపించారని అన్నారు. జనసంద్రంతో కడప మునిగిపోయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో పెట్టి చూపించామని తెలిపారు. కడప గడపలో మహానాడు సూపర్ హిట్ అయిందన్నారు. ఉమ్మడి కడపలో పదికి 7 స్థానాల్లో గెలిచామని, వచ్చే ఎన్నికల్లో పది స్థానాలు గెలుచుకోవాలని ఆయన నాయకులకు సూచించారు.