అక్షరటుడే, వెబ్డెస్క్: Rajahmundry | రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా పెద్దపులి (Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్దపులి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
జాతీయ రహదారి (National Highway) పక్కనే ఉన్న ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ వద్ద కూడా పులి దర్శనమివ్వడం మరింత ఆందోళన కలిగించింది. అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు పెద్దపులి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక దశలో రోడ్డుపక్కన సంచరిస్తున్న పెద్దపులిని కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు వీడియో తీయగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Rajahmundry | భయపెట్టిస్తున్న పెద్ద పులి..
పులి కనిపించిన ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. గాడాల ప్రాంతం వద్ద పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపించడంతో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల వరకు ఏలూరు జిల్లా (Eluru District) ఏజెన్సీ ప్రాంతాల్లో వణికించిన ఇదే పెద్దపులి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 1న రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసిన ఘటన కూడా ఇదే పులి పని కావచ్చని భావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, పులి దాడి జరిగిన విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వారి వెనుకభాగంలోనే పులి సంచరించిన దృశ్యాలు కూడా కనిపించాయి.
ఇక నెల్లూరు జిల్లా (Nellore District) దత్తలూరు మండలం నందిపాడు ప్రాంతంలోనూ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రేమానుకుంట వద్ద పులిని చూసినట్లు గ్రామస్తులు చెబుతుండటంతో ఉదయగిరి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో గడుపుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు రావడానికి జనం వెనుకాడుతున్నారు. అటవీ శాఖ అధికారులు (Forest Department Officers) ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లకూడదని, ఒంటరిగా అడవుల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. పశువులను బహిరంగ ప్రదేశాల్లో కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.