Union Minister Rajnath Singh | ఇది ట్రైల‌రే.. సినిమా ముందుంది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డి
Union Minister Rajnath Singh | ఇది ట్రైల‌రే.. సినిమా ముందుంది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Defence Minister | బాధ్య‌తారాహిత్యంగా ఉండే దుష్ట దేశ‌మైన పాకిస్తాన్(Pakistan) చేతిలో ఉన్న అణ్వాయుధాలు సుర‌క్షితంగా ఉన్నాయా ? అని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Union Defense Minister Rajnath Singh) ప్ర‌శ్నించారు. దుష్ట దేశం వ‌ద్ద ఉన్న అణ్వాయుధాల‌ను అంత‌ర్జాతీయ అణుశ‌క్తి సంస్థ (ఐఏఈఏ) తీసుకోవాల‌ని కోరారు. పాకిస్తాన్‌తో కాల్పుల విర‌మ‌ణ అనంత‌రం గురువారం ఆయ‌న తొలిసారిగా కాశ్మీర్‌లో ప‌ర్య‌టించారు. నియంత్రణ రేఖ (LOC), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్‌లో కీలకమైన పర్యటన చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధాల బాధ్యతను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీసుకోవాలని రక్షణ మంత్రి కోరారు. “ఇలాంటి బాధ్యతారహితమైన, దుష్ట దేశం చేతిలో అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా అని నేను మొత్తం ప్రపంచాన్ని అడుగుతున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకోవాలని నమ్ముతున్నాను” అని రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్‌లో భారత సైనికులను(Indian Soldiers) ఉద్దేశించి అన్నారు.

Defence Minister | ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేస్తాం..

దేశంపైకి ఉసిగొల్పే ఉగ్ర‌వాద శిబిరాలు ఎక్క‌డ ఉన్నా నేల‌మ‌ట్టం చేస్తామ‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదుల‌తో పాటు వారి వెనుక ఎవరున్నా చావుదెబ్బ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఉగ్ర‌వాద పోరులో ప్రాణాల‌కు తెగించి పోరాటం చేస్తున్న సైనికుల‌కు సెల్యూట్ చేశారు. అలాగే, శ‌త్రువుల‌తో పోరులో ప్రాణాల‌ర్పించిన అమ‌రుల‌కు ఆయ‌న ఘ‌నంగా నివాళులర్పించారు. ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) ఒక పేరు మాత్ర‌మే కాద‌ని, అది ఒక క‌మిట్మెంట్ అని స్ప‌ష్టం చేశారు. భార‌త్‌పై ఉగ్ర‌దాడి(Terror Attack) జ‌రిగితే దానిని యుద్ధ చ‌ర్య‌గానే భావిస్తామ‌ని చెప్పారు. మన బ‌ల‌గాలు అత్యున్న‌తంగా ప‌ని చేస్తున్నాయ‌ని, అద్భుతమై పోరాట ప‌టిమ‌తో శత్రువుల‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టార‌న్నారు.