అక్షరటుడే, వెబ్డెస్క్: Harish | ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా పాకిస్తాన్(Pakistan) సీమాంతార ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, దాని వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భారత్(India) వెల్లడించింది. సింధు జలాల(Sindhu River) ఒప్పందం రద్దుపై ఆ దేశం అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. శనివారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్(Harish) మాట్లాడుతూ పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. “నీరు ప్రాణం, యుద్ధ ఆయుధం కాదు” అని ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రతినిధి సింధూ జలాల ఒప్పందం అంశాన్ని లేవనెత్తడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి(Terror Attack) తర్వాత సింధూ జలాల ఒప్పందం రద్దు చేశామని, దీనిపై పాకిస్తాన్ “తప్పుడు సమాచారం” అందించిందని విమర్శించారు. “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా” ఉన్న పాకిస్తాన్, సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు 65 ఏళ్ల ఒప్పందం నిలిపివేయబడుతుందని స్పష్టం చేశారు.
Harish | బాధ్యతగా భారత్..
పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల ఊచకోత తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. భయంకరమైన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ “సీమాంతర సంబంధాలు” ఉన్నట్లు కనుగొన్న తర్వాత కఠిన చర్యలు తీసుకుంది. పాక్కు ప్రాణాధారమైన సింధూ జలాలను నిలిపి వేసింది. ఇదే అంశాన్ని ఆ దేశం ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తగా, భారత్ కొట్టిపడేసింది. “భారతదేశం ఎల్లప్పుడూ ఒక ఎగువ నదీ తీర దేశంగా బాధ్యతాయుతంగా వ్యవహరించింది” అని పాకిస్తాన్ వైఖరిని “బహిర్గతం” చేసే నాలుగు అంశాలను హరీశ్ హైలైట్ చేస్తూ వివరించారు. “మొదటిది, భారతదేశం 65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసింది. ఆ ఒప్పందం ప్రవేశిక స్ఫూర్తితో, స్నేహంతో ఎలా ముగించిందో వివరిస్తుంది. ఆరున్నర దశాబ్దాలుగా భారతదేశంపై మూడు యుద్ధాలు, వేలాది ఉగ్ర దాడులను చేయడం ద్వారా పాకిస్తాన్ ఆ ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించింది” అని హరీశ్ వివరించారు.
Harish | ఉగ్రదాడులకు 20 మంది బలి..
గత నాలుగు దశాబ్దాలలో భారత్ ఉగ్రదాడులతో సతమతమవుతోందని హరీశ్ వెల్లడించారు. ఈ దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు(Indians) ఉగ్రవాద దాడుల్లో మరణించారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో భారతదేశం “అసాధారణ సహనం ఉదారతను” ప్రదర్శించిందని గుర్తు చేశారు. “భారతదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ(Pakistan government) ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదం పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంది” అని విమర్శించారు. “రెండవది, ఈ 65 సంవత్సరాలలో, సరిహద్దు ఉగ్రవాద దాడుల ద్వారా పెరుగుతున్న భద్రతా సమస్యల పరంగా మాత్రమే కాకుండా, స్వచ్ఛమైన శక్తి, వాతావరణ మార్పు, జనాభా మార్పు కోసం పెరుగుతున్న అవసరాల పరంగా కూడా ప్రాథమిక మార్పులు జరిగాయి” అని భారత రాయబారి అన్నారు.”కొన్ని పాత ప్రాజెక్టులు తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే, పాకిస్తాన్ ఈ మౌలిక సదుపాయాలలో ఏవైనా మార్పులను, ఒప్పందం ప్రకారం అనుమతించిన నిబంధనలలో మార్పులను నిరంతరం అడ్డుకుంటూనే ఉంది” అని తెలిపారు. 2012లో జమ్మూకశ్మీర్లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్పై ఉగ్రవాదులు దాడి చేశారని గుర్తు చేశారు. ఈ విరక్త చర్యలు మన ప్రాజెక్టుల భద్రతకు, పౌరుల జీవితాలకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు.
“మూడవదిగా, గత రెండు సంవత్సరాలలో అనేక సందర్భాల్లో ప్రాజెక్టుల మార్పులపై చర్చించాలని భారతదేశం అధికారికంగా పాకిస్తాన్ను కోరింది. అయితే, పాకిస్తాన్ వీటిని తిరస్కరిస్తూనే ఉంది. భారతదేశం చట్టబద్ధమైన హక్కులను పూర్తిగా ఉపయోగించుకోకుండా పాకిస్తాన్ అడ్డుకునే విధానాన్ని కొనసాగుతోంది” అని హరీశ్ ఎత్తిచూపారు. “నాలుగు, ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా ఉన్న పాకిస్తాన్, సరిహద్దు ఉగ్రవాదానికి విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఒప్పందం నిలిపివేయబడుతుందని భారతదేశం ప్రకటించింది” అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది పాకిస్తాన్ అని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పారు.