అక్షరటుడే, వెబ్డెస్క్:Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన దారుణ మారణ హోమంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ(Pakistan Army)తో పాటు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI), లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) హస్తముందని వెల్లడైంది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆదేశాల మేరకే లష్కరే తోయిబా దాడికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ(NIA) వర్గాలు వెల్లడించాయి. 26 మంది పర్యాటకులను చంపిన ఉగ్ర దాడి వెనుక కుట్ర పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంలో రూపొందించినట్లు గుర్తించారు.
Pahalgam Terror Attack | వారిద్దరు పాక్ పౌరులే..
పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆదేశాల మేరకు లష్కరే తోయిబా కుట్ర పన్నిన ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు పాకిస్తాన్ పౌరులు స్వయంగా పాల్గొన్నారు. హష్మి ముసా అలియాస్ సులేమాన్ అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ను పాకిస్తాన్ పౌరులుగా ఎన్ఐఏ(NIA) నిర్ధారించింది. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, దాడి చేసిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లతో కమ్యూనికేషన్(Handlers Communication)ను కొనసాగించారని వెల్లడైంది. అలాగే, పాక్ నుంచి అందిన లాజిస్టిక్స్తో పాటు అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు దాడికి పాల్పడ్డారని తేలింది. కుట్ అమలుకు నిర్దేశిత సమయం ఎంపిక కూడా పాక్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే జరిగిందని గుర్తించారు.
Pahalgam Terror Attack | కొన్ని వారాల ముందే..
పహల్గామ్ దాడికి కొన్ని వారాల ముందే ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా చొరబడ్డారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్(Overground Workers) నెట్వర్క్ సహాయం అందించిందని, షెల్టర్, నావిగేషన్, స్థానిక లాజిస్టికల్ మద్దతును అందించారని తేలింది.
Pahalgam Terror Attack | కీలక ఆధారాల సేకరణ
ఎన్ఐఏ(NIA) ఇప్పటికే కీలకమైన ఆధారలను సేకరించింది. విస్తృతమైన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటాను సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40 కి పైగా ఖాళీ కార్ట్రిడ్జ్లను బాలిస్టిక్(Cartridges Ballistic), రసాయన విశ్లేషణ కోసం పంపారు. దాడి జరిగిన ప్రాంతంలో 3D మ్యాపింగ్ను కూడా నిర్వహించారు, లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుంచి ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ డేటాను సేకరించారు.
Pahalgam Terror Attack | శాటిలైట్ ఫోన్స్ వినియోగం..
భారత్లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లు(Satellite phones) వాడినట్లు గుర్తించారు. దాడికి ముందు రెండు, మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో శాటిలైట్ ఫోన్ కార్యకలాపాలు పెరిగాయి. బైసారన్(Baisaran), చుట్టుపక్కల కనీసం మూడు శాటిలైట్ ఫోన్లు పని చేస్తున్నాయని గుర్తించారు. ఉగ్రదాడిపై విస్తృతంగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ ఇప్పటికే 2,800 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించాయి. 150 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనుమానిత ఓవర్గ్రౌండ్ వర్కర్స్తో పాటు జమాత్-ఇ-ఇస్లామి(Jamaat-e-Islami) వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. చాలాచోట్ల సోదాలు నిర్వహించారు. IC-814 హైజాక్ కేసులో కీలక వ్యక్తి, ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న ముష్తాక్ అహ్మద్ జర్గర్ అలియాస్ లాట్రమ్ ఇంట్లో సోదాలు జరిగాయి. దాడి చేసిన వారి కదలికలను గుర్తించడానికి ఎన్ఐఏ పహల్గామ్ చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను సేకరించింది.
