
అక్షరటుడే, వెబ్డెస్క్:Pahalgam Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన జరిగి వారం అవుతున్నా ఆ ఘటనకి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రుషి భట్ అనే వ్యక్తి తాను జిప్లైన్(Zipline) ఎక్కే సమయంలో దానిని ఆపరేట్ చేసే వ్యక్తి అల్లాహో అక్బర్.. అంటూ మూడు సార్లు బిగ్గరగా అరిచాడని.. అనంతరం కొద్ది సెకన్లకే పర్యాటకులపై ఉగ్రవాదులు(Terrorists) కాల్పులు జరిపారని వివరించారు. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని జల్నాకు చెందిన ఆదర్శ్ రౌత్ అనే యువకుడు సైతం స్పందిస్తూ.. దాడికి ఒక రోజు ముందు అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. ఎన్ఐఏ(NIA) విడుదల చేసిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను చూశాక తనకు ఆ అనుమానం మరింత బలపడిందని చెప్పారు.
Pahalgam Terror Attack | ముందే రెక్కీ..
‘ఏప్రిల్ 21వ తేదీ పహల్గామ్(Pahalgam)కు వెళ్లిన సమయంలో బైసరన్ వ్యాలీ(Baisaran Valley)లోని మ్యాగీ స్టాల్కు చేరుకున్నా. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి.. నువ్వు హిందువా? అని ప్రశ్నించాడు. ఇంతలో మళ్లీ అతడే.. నీవు కశ్మీర్కు చెందినవాడిలా లేవే అంటూ తనను ఆరా తీశాడన్నారు. అతడు తనను ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్ధం కాలేదు. ఆ రోజు రద్దీ స్వల్పంగా ఉంది అని’ ఆదర్శ్ రౌత్ చెప్పారు. అయితే ముష్కరులు కొన్ని రోజుల ముందే పెహల్గామ్ వచ్చి నాలుగు చోట్ల రెక్కీ(Rekki) నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. పక్కా ప్రణాళికతోనే బైసరాన్ వ్యాలీ లో నరమేధం సృష్టించినట్లు అధికారులు తమ దర్యాప్తులో వెల్లడించారు.
టెర్రరిస్టులకు క్షేత్ర స్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్(Over Ground Workers)ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేసి, వారిని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీనే పెహల్గామ్(Pahalgam)కు వచ్చినట్లు అరెస్టైన వారిలో ఒకరు చెప్పినట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారు నాలుగు చోట్ల రెక్కీలు నిర్వహించినట్లు చెప్పారు. బైసరాన్ వ్యాలీ, అరు వ్యాలీ, అమ్యూస్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీలను సందర్శించి రెక్కీ నిర్వహించారు. అయితే అరు వ్యాలీ, అమ్యూస్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీలో భద్రతా ఏర్పాట్లు ఉండటంతో వారు దాడులు చేయడానికి కొంత ఆలోచించారు. బైసరాన్ వ్యాలీలో భద్రత లేకపోవడంతో తమ దాడికి సరైన ప్రదేశంగా ఎంచుకొని విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) గుర్తించింది.