అక్షరటుడే, వెబ్డెస్క్ : America | సుంకాలతో భారత్ను భయపెట్టాలని చూసిన అమెరికా వెనక్కి తగ్గింది. భారత దౌత్య నీతి ముందు అగ్రరాజ్యం బెదిరింపులు పని చేయలేదు.
రష్యా (Russia) నుంచి ఆయిల్, ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే కారణంతో డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అమెరికా చర్యలకు ఏ మాత్రం వెరవకుండా.. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేసింది. అంతేగాకుండా చైనా(China)తో కూడా సంబంధాలను పునరుద్ధరించింది. దీంతో భారత్, రష్యా, చైనా మూడు దేశాలు కలిస్తే తమకు ప్రమాదం అని భావించిన అమెరికా వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత్తో చర్చలకు సిద్ధమని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా రాయబారి సెర్గీ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
America | యూఎస్కు దగ్గర చేసుకుంటాం
భారత్–అమెరికా సంబంధాలపై భారత్కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ (Sergey Gore) మాట్లాడారు. భారత్ను చైనాకు దూరం చేసి, అమెరికాకు దగ్గర చేయడమే తమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. ఇండియాను యూఎస్ వైపు తీసుకు రావడం ముఖ్యమైన విషయమని చెప్పారు. తమ పెట్రోలియం ఉత్పత్తుల కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని చూస్తున్నట్లు చెప్పారు. అయితే రష్యా తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తుండటంతో భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇరుదేశాల మధ్య చర్చలతో అడ్డంకులు తొలగిపోతాయని గోర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో కంటే అమెరికాతోనే భారత్కు గొప్ప స్నేహం ఉందని చెప్పారు. భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్, ప్రతినిధులను చర్చల కోసం ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారన్నారు. ఈ చర్చల్లో కీలక ఒప్పందాలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
America | భారత్కు ట్రంప్..
డోనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు సమాచారం. నవంబర్లో ఇండియాలో జరిగే క్వాడ్ సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని సెర్గియో గోర్ వెల్లడించారు. అయితే పర్యటనకు సంబంధించి చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా ఓ వైపు చర్చలు అంటూనే అమెరికా భారత్పై సుంకాలు విధించాలని జీ7 దేశాలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఒత్తిడి తీసుకు రావడానికి భారత్, చైనాలపై 50 నుంచి 100శాతం సుంకాలు విధించాలని అమెరికా ఆయా దేశాలను కోరినట్లు సమాచారం.