అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యూసుఫ్గూడ (Yusufguda)లో మంగళవారం నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచితే హీరోలు (Heroes), నిర్మాతలు (Producers) లాభ పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. కానీ దాని నుంచి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి టికెట్ ధరలు పెంచడంతో వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తామంటేనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు జీవో జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సినీ కార్మికుల కష్టాలు తనకు తెలుసన్నారు. నేడు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్లిందంటే.. తెర వెనుక కార్మికుల శ్రమ ఫలితమే అని ఆయన అన్నారు.
CM Revanth Reddy | చిన్న సినిమాలకు..
హాలీవుడ్ (Hollywood) సినిమాల కోసం కూడా తెలంగాణకు వచ్చి షూటింగ్ చేసుకోవాలన్నారు. ఆ మేరకు వసతులు కల్పిస్తామన్నారు. అలాగే చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఐటీ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, సినీ పరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నమని ఆయన చెప్పారు.
CM Revanth Reddy | కృష్ణా నగర్లో పాఠశాల..
కార్మికుల పిల్లల కోసం కృష్ణా నగర్ (Krishna Nagar)లో కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు రూ.10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఆ డబ్బులను వినియోగించాలని సూచించారు. ఫైటర్స్, టెక్నీషియన్ల నైపుణ్యం పెంచేందుకు ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

