అక్షరటుడే, లింగంపేట: Lingampet | పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం అయ్యపల్లిలో చోటు చేసుకుంది. లింగంపేట్ ఇన్ఛార్జి ఎస్సై భార్గవ్గౌడ్ (SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి (Ayyapally) తండాలో మూడు రోజుల క్రితం మేకల చోరీ జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదు కాగా.. చల్ల మహేశ్, కాంట్రపల్లి ప్రవీణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ఇద్దరు కూడా మేకల చోరీకి పాల్పడ్డట్లుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంధం లేని కేసులో తన పేరు రాసినందుకు అవమానంగా భావించిన అయ్యపల్లి గ్రామానికి చెందిన చిలుక లక్ష్మీనారాయణ (40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో గ్రామస్థులు ఆగ్రహానికి గురై ఆదివారం పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి పోలీస్స్టేషన్కు చేరుకొని వారిని సముదాయించారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్రిక విలేకరి, మహేష్, ప్రవీణ్లపై కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జి ఎస్సై వివరించారు.