అక్షరటుడే, ఇందూరు: CPS | ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేశారు. కళాశాల ఎదుట నల్లబ్యాడ్జీలతో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తపెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికీ అనేకసార్లు మొరపెట్టుకున్నామని, ఇకనైనా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ దండు స్వామి, లెఫ్టినెంట్ రామస్వామి, జయప్రద, రంజిత, ముత్తెన్న, చంద్రశేఖర్, రమేష్ గౌడ్, పూర్ణచందర్, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
CPS | పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
అక్షరటుడే, డిచ్పల్లి: ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెయూ టీచర్స్ అసోసియేషన్ (TU Teachers Association) అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెయూ వీసీ యాదగిరిరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీచర్స్ అసోసియేషన్ (టూటా) (TUTA) అధ్యక్షుడు పున్నయ్య మాట్లాడుతూ.. నూతన పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం 2003 ఆగస్టు 23న నూతన పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించి, పార్లమెంట్లో ఆమోదం తెలపకుండానే 2004 అక్టోబర్ 01 నుంచి అమలులోకి తేవడం సరికాదన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాలు ఈ తీర్మానాన్ని స్వచ్ఛందంగా ఎంచుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినా.. చాలా రాష్ట్రాలు పోటీపడి నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకోవడం విచారకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ అడికే నాగరాజు, రాంబాబు గోపిశెట్టి, నాగరాజు, చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, రాజేశ్వరి, బాలకిషన్, శిరీష బోయపాటి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
CPS | తెయూలో నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన
అక్షరటుడే, డిచ్పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిపాలన భవనం ఎదుట సోమవారం నాన్టీచింగ్ సిబ్బంది (Non-teaching staff) నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెన్షన్ విద్రోహ దినం (సెప్టెంబర్ 1) సందర్భంగా ఈ మేరకు నిరసన తెలిపినట్లు వారు పేర్కొన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నాన్ టీచింగ్ సంఘం (రెగ్యులర్) అధ్యక్షుడు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్ మాట్లాడుతూ.. ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్, రెగ్యులర్ సిబ్బంది, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ ఉమారాణి, జ్యోతి, సంకీర్తన, ధీరజ్, పాష తదితరులు పాల్గొన్నారు.