అక్షరటుడే, కోటగిరి: Pothangal | మంజీర నదిలో (Manjira river) ఇసుక తరలించే క్రమంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో అధికారులు మంజీర నదిలో ఇసుక ఉన్న ప్రాంతాలను సందర్శించారు. తహశీల్దార్ గంగాధర్, జిల్లా మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ నగేష్ ఆధ్వర్యంలో అధికారులు పోతంగల్ మండలంలో కొడిచెర్ల (Kodicherla) శివారులో మంజీరను పరిశీలించారు.
పట్టా భూమి నుంచి ఇసుక రవాణా జరుగుతుందా లేక మంజీర నది నుంచి జరుగుతుందా అనే విషయాన్ని తనిఖీ చేశారు. అనంతరం తహశీల్దార్ గంగాధర్ (Tahsildar Gangadhar) మాట్లాడుతూ ఓ రైతు తన నాలుగెకరాలకు సంబంధించిన పట్టా భూమిలో నుంచి ఇసుక రవాణా జరుగుతోందని పేర్కొన్నారు.
అలా కాకుండా ఇసుకను మంజీర నుంచి తరలించినట్లు తేలితే కఠిన చర్యలు (strict action) తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వాదేశానుసారం మాత్రమే ఇసుకను తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ దత్తు, ఎస్సై సునీల్, సర్వేయర్ పోశెట్టి, జీపీవో సాయిలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
