అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు.
ఏసీబీ దాడులు(ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. లంచం తీసుకోవడం కూడా తమ హక్కుగా భావిస్తున్నారు. పనులను బట్టి రూ.వేల నుంచి మొదలు కొని రూ.లక్షల వరకు లంచాలు అడుగుతున్నారు. తాజాగా ఓ మహిళా అధికారి ఏకంగా రూ.నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.
ACB Raid | ఎల్ఆర్ఎస్ కోసం
హైదరాబాద్ (Hyderabad) శివారులోని నార్సింగి (Narsingi) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officers) మంగళవారం పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఓ వ్యక్తి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్ను క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రూ.పది లక్షల లంచం డిమాండ్ చేసింది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ.నాలుగు లక్షల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ శ్రీధర్(ACB DSP Sridhar) ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు(Municipal Office)లో తనిఖీలు నిర్వహించారు. ఆమెపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.