HomeతెలంగాణAmit shah tour | ఎంపీ అర్వింద్‌పై అక్కసు.. ఆ నేతలు రాకుండా అడ్డుపుల్లలు.. బీజేపీ...

Amit shah tour | ఎంపీ అర్వింద్‌పై అక్కసు.. ఆ నేతలు రాకుండా అడ్డుపుల్లలు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై శ్రేణుల అసహనం..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah tour | కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు (national turmeric board) ఏర్పాటు చేయడంతో ఆ పార్టీకి ఎంత మైలైజ్​ తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా తెలంగాణలో.. అలాగే అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్​ జిల్లాలోనే (Nizamabad District) బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏకంగా హోం మంత్రి అమిత్​ షా (Home Minister Amit Shah) ఆదివారం నిజామాబాద్​కు వచ్చి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో పసుపు రైతులకు పండుగే అని.. పసుపు రాజధానిగా నిజామాబాద్​ మారుతుందని ఆయన ప్రకటించారు. దీంతో పసుపు రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు బీజేపీ (BJP) శ్రేణులు సైతం తమ వల్లే పసుపు బోర్డు (turmeric board) సాధ్యమైందని ఉత్సాహంలో ఉన్నారు. కానీ.. ఈ బోర్డు కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది.

పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఈ ప్రాంత రైతులు 40 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని 2019 పార్లమెంట్​ ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్​ (MP Arvind) రైతులకు (Farmers) బాండ్​ పేపర్​పై రాసిచ్చారు. అప్పటి నుంచి ఆయన బోర్డు ఏర్పాటు కోసం చేయని ప్రయత్నాలు లేవు.

పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్యులను కలిసి బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. చివరకు గత పార్లమెంట్​ ఎన్నికల సమయంలో బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ (PM Modi) మహబూబ్​నగర్​ సభలో బోర్డును ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. అనంతరం బోర్డు కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. చివరకు నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించేలా ఎంపీ అర్వింద్​ ఎంతో చొరవ తీసుకున్నారు. బోర్డు జాతీయ కార్యాలయ ప్రారంభ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. దీంతో పసుపు రైతులు సైతం తమకు భవిష్యత్తులో మంచి రోజులు రావడం ఖాయమని ధీమాలో ఉన్నారు.

Amit shah tour | రాష్ట్ర నాయకత్వం తీరుపై విమర్శలు

జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board Office) ప్రారంభోత్సవానికి అమిత్​షా రానుండడంతో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి ఏర్పాట్లను అన్నీ తానై చూసుకున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలో బీజేపీకి ఇది బాగా మైలేజ్​ తీసుకువచ్చే అంశం కావడంతో నేతలందరిని సైతం ఏకం చేయాలని ఆయన సంకల్పించారు. ఇందుకోసం రాష్ట్రంలోని పార్టీకి చెందిన తన సహచర ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానించారు.

కానీ, ప్రారంభోత్సవానికి అనుమతి లేదంటూ రాష్ట్ర నాయకత్వం మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలతో చెప్పినట్లు సమాచారం. నేటి అమిత్​షా సభకు రావద్దని చెప్పారని పలువురు నేతలు గుసగుసలాడారు. కాగా.. ఈ వ్యవహారంతో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలలో అపోహలు తలెత్తాయి. ముఖ్యంగా అమిత్ ​షా రాష్ట్రానికి వస్తుంటే రాష్ట్ర నాయకత్వం తమకు అనుమతి లేదని చెప్పడం ఏమిటని వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ అర్వింద్ పైన అక్కసుతోనే ఇలా చేశారా..? అనే చర్చ పార్టీ ముఖ్య నేతల్లో మొదలైంది.

Amit shah tour | సహాయ నిరాకరణ..!

అమిత్​షా లాంటి అగ్రనేత రానుండడం, ముఖ్యంగా రైతులకు సంబంధించిన కీలక మైలురాయి కావడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలి. కానీ.. ఎంపీ అర్వింద్​ ఒక్కరే అటు జనసమీకరణ, ఇటు కార్యక్రమ ఏర్పాట్లలో అన్నీ తానై చూసుకున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుపుల్లలు వేశారని ప్రచారం సాగుతోంది. పసుపు రైతులు (Farmers) ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే.. ఈ అంశాన్ని పార్టీకి మైలేజ్​గా వాడుకుని ముందుకు వెళ్లాల్సిన కాషాయ పార్టీ ముఖ్యనేతలు అడ్డంకులు సృష్టించడం వెనుక ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. మరోవైపు ఈ తాజా పరిణామాలపై నిజామాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్వింద్​ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని.. మరోవైపు ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని.. కావాలనే ఆయనకు మైలేజ్​ రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారనే చర్చ సాగుతోంది.

Must Read
Related News