అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep vs KVR | కామారెడ్డి పట్టణంలో ఇంతలా అల్లకల్లోలం కావడానికి కారణం ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR) అని ఎన్ఎస్యూఐ (NSUI Kamareddy) జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ (Ireni Sandeep) ఆరోపించారు. తనను ఒక్కడినే రమ్మన్నానని ఎమ్మెల్యే చెప్పడం అబద్ధమని పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో సందీప్ మాట్లాడారు.
NSUI Sandeep vs KVR | ఎమ్మెల్యే చెబితేనే..
ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి ఆయనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు తీసుకుని రావాలని, అలాగే ఆయనపై ఆరోపణలు చేసిన అందరినీ తీసుకుని రావాలని చెప్పారన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్లుగానే తాను సమాచారమిచ్చానని తెలిపారు. అన్ని సోషల్ మీడియా గ్రూపులలో కాంగ్రెస్ నాయకులు (Telangana Politics) తరలిరావాలని పబ్లిసిటీ చేశామని చెప్పడం సరికాదన్నారు. కామారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావాలని, తద్వారా చర్చకు పోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భావించారని ఆరోపించారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా భౌతిక దాడులు చేయాలని బీజేపీ కార్యకర్తలను ఎమ్మెల్యే ఉసిగొల్పారని ఒక వీడియోను ప్రదర్శించారు. శనివారం జరిగిన ప్రతి ఘటనకు ఎమ్మెల్యేనే బాధ్యుడన్నారు.
హౌస్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే ఎమ్మెల్యే..
నిజాలు తేల్చడానికి తాము వెళ్లామని, హౌస్ అరెస్ట్ పేరుతో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడని ఐరేని సందీప్ ఆరోపించారు. అరోరా కళాశాల(Aurora College) యజమాని ఎవరని, ఆయనకు కమిటీకి ఏమి సంబంధమో చెప్పాలన్నారు. రమణారెడ్డి తండ్రి ఉండగానే ఎలాంటి తీర్మానం లేకుండా కమిటీలో ఎలా మెంబర్గా వచ్చారని ప్రశ్నించారు. ఎజెండా తీర్మానాలు పాస్ చేసినప్పుడు నాడు సంతకాలు చేశారని, ఆ తర్వాత రిజల్యూషన్ పాస్ చేశారని తెలిపారు. ఆ సంతకాలు రమణారెడ్డి చేయకపోతే అవి ఫోర్జరీ సంతకాలు అయితే నాడు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కళాశాల భూముల్లో ఉన్న భవనాల నుంచి కమిటీకి చాలా డబ్బులు వచ్చాయని, వాటికి లెక్కలు లేవన్నారు. కమిటీలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
తనను ఎందుకు రమ్మన్నారో సమాధానం చెప్పాలి..
ఎస్పీ ఫోన్ చేసి బయటకు వెళ్లవద్దని చెప్పినప్పుడు, శిశుమందిర్ ప్రాంగణానికి రావడానికి ఎమ్మెల్యేకు ఇష్టం లేనప్పుడు తనను రమ్మని ఎందుకు ఫోన్ చేశారో చెప్పాలని సందీప్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో అల్లకల్లోలం సృష్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విషయాన్ని పక్కదారి పట్టించకుండా తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, అదే రీతిలో ఆయన కూడా రావాలన్నారు. క్యాంప్ కార్యాలయానికి మహేందర్ రెడ్డి వెళ్లాల్సిన అవసరం ఏముందని విలేకరులు ప్రశ్నించగా అతనికి ఎమ్మెల్యేకు వ్యక్తిగత సంబంధాలు ఉండవచ్చని, ఏదైన పనిమీద వెళ్లి ఉండవచ్చని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు సమాధానమిచ్చారు. అలాంటప్పుడు ఎమ్మెల్యే కేవీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేశారని ప్రశ్నించగా అతను కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని, తమకు సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.



