అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైడ్రాలో పని చేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పగలూ రాత్రి పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. హైడ్రాలో (Hydraa) పని చేస్తున్న తమ జీతాలు తగ్గుతాయని మార్షల్స్ సోమవారం ఉదయం విధులు బహిష్కరించారు.
తమకు రూ.29 వేల జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.22,500 ఇస్తామని జీవో జారీ చేశారని మార్షల్స్ (Marshals) ఆరోపించారు. అంత తక్కువ జీతంతో ఎలా పనిచేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో కొంత మంది అధికారులు అమర్యాదగా మాట్లాడుతున్నారని వాపోయారు. పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెరిగాయన్నారు. మార్షల్స్ విధులు బహిష్కరించడంతో నగరంలోని 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. దీంతో హైడ్రా కమిషనర్ వారితో చర్చించారు.
Hydraa | అనుమానాలు నివృత్తి చేశాం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను రెగ్యులరైజ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో… హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్ కొంతమంది అనవసరమైన ఆందోళన చెందారని కమిషనర్ అన్నారు. సమాచార లోపంతో ఈ జీవో ప్రకారం జీతాలు తగ్గుతాయేమో అని ఆందోళన చెందారని.. సోమవారం వారితో మాట్లాడి.. అనుమానాలను నివృత్తి చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు (Salaries) తగ్గవని.. గతంలో ఉన్న జీతాలే వారికి చెల్లిస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసం, గుర్తింపు ఉందని.. అందుకనుగుణంగా అందరూ కష్టపడి పని చేస్తున్నారని కమిషనర్ చెప్పారు. సైన్యంలో (Army) పని చేసి వచ్చిన వారే మార్షల్స్గా ఉన్నారని వారి సేవలపై హైడ్రా పూర్తి విశ్వాసంతో ఉందని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వారికి ఇక్కడి కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్టయితే.. ఆ విధానాలను కూడా అధ్యయనం చేస్తామన్నారు. అలాగే మార్షల్స్తో అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.