అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha on SIT | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణపై అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.
కవిత సోమవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను సిట్ విచారించిన అనంతరం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన సిట్ విచారణను తప్పు పట్టారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రానన్ని రోజులు బీఆర్ఎస్ను ఎవరు కాపాడలేరన్నారు. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వరకు ఈ కేసు విచారణ పేరిట హడావుడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను సిట్ అధికారులు విచారణకు పిలిస్తే హాజరు అవుతానని తెలిపారు.
Kavitha on SIT | మంచి వారిని గెలిపించాలి
మున్సిపల్ ఎన్నికల్లో పని చేసే అభ్యర్థులను గెలిపించాలని కవిత కోరారు. గుడ్డిగా పార్టీ గుర్తు చూసి ఓటు వేయొద్దన్నారు. తమ జాగృతి నాయకులు సైతం పలు చోట్ల పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరిట పోటీలో ఉంటారన్నారు. సాధ్యమైనంత వరకు మంచి వారికే టికెట్లు ఇచ్చామన్నారు. వారిని గెలిపించాలని ప్రజలను కోరారు.
Kavitha on SIT | తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ (Telangana)ను విస్మరించారని కవిత విమర్శించారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాల మీద అడిగితే బడ్జెట్లో కేంద్రం ఒక్కదానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) 30 సార్లు ఢిల్లీకి వెళ్లినా.. రూ.30 వేల కోట్లు కూడా తేలేకపోయారన్నారు.
Kavitha on SIT | వారికి ఆయుధాలు ఇవ్వాలి
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Excise Constable Soumya) మృతిపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గాయపడితే.. సీఎం కనీసం ట్వీట్ చేయలేదన్నారు. ఎక్సైజ్ పోలీసులపై దాడులను అరికట్టడానికి వారికి ఆయుధాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఫారెస్ట్ సిబ్బందికి సైతం వెపన్స్ ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Kavitha on SIT | ఫేక్ ఎంవోయూలు
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit)పై కవిత స్పందించారు. ఊరు పేరు లేని కంపెనీలు వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు. రూ.లక్షల విలువైన కంపెనీలు సైతం వేల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఫేక్ అన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని కవిత తెలిపారు.