అక్షరటుడే, వెబ్డెస్క్: NMC | దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉగ్రవాద మాడ్యూల్ కేసులో నలుగురు వైద్యులపై నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) కఠిన చర్యలు తీసుకుంది.
ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదైన నేపథ్యంలో, ఈ నలుగురు డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేసి, భారతదేశంలో వైద్య వృత్తి నిర్వహించడానికి నిషేధం విధించింది. NMC ఆదేశాల మేరకు, ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు వారి పేర్లను ఇండియన్ మరియు నేషనల్ మెడికల్ రిజిస్టర్ల నుంచి తక్షణమే తొలగించాయి.
NMC | ఉగ్ర లింకులు..
తాజా ఉత్తర్వుల్లో డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ అనే ఈ నలుగురికి ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధం ఉన్నట్లు పేర్కొంది. దర్యాప్తు సంస్థల ప్రకారం, వీరంతా పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్కు చెందిన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో (Police Custody) ఉన్న ఈ నలుగురు వైద్యులు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి వైద్య సేవలు అందించడానికి లేదా వైద్య నియామకాల్లో కొనసాగడానికి పూర్తిగా అనర్హులని NMC స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు వీరి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్ (ammonium nitrate), ఆయుధాలు, అలాగే బాంబు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
