అక్షరటుడే, వెబ్డెస్క్: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది. భారత స్థానిక కాలమాన ప్రకారం.. సాయంత్రం 6:46 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇన్వర్ కార్గిల్కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ భూకంప ప్రభావంతో దేశవ్యాప్తంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మాక్వేరీ ద్వీప ప్రాంతంలో తిరిగి రాత్రి 8:23 నిమిషాల ప్రాంతంలో మరోమారు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదైంది. భూమికి 4.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
వరుసగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించింది.
కాగా, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ ఎర్త్ క్వేక్లను అధికారులు భారీ, భూకంపాలుగా పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణమైన పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్లో 5 మిలియన్ల మందికి పైగా నివస్తున్న న్యూజిలాండ్ ఉంది. ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఆ దేశాల్లోనూ…
అదే సమయంలో వనువాటులోని లుగాన్విల్లేలోనూ భూకంపం ఏర్పడింది. భారత కాలమాన ప్రకారం.. రాత్రి 7:19 గంటలకు సోలోమాన్ దీవికి 300 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది.
టోంగాలోనూ భూకంపం ఏర్పడింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నుకువాలోఫాకు 755 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైంది.