అక్షరటుడే, వెబ్డెస్క్: Building Permissions | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ SCS 2025 (Simplified Construction System) కింద కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
భవన అనుమతుల జారీకి సంబంధించి పలు విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం, ఇకపై ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేసింది. OBPS (Online Building Permission System) ద్వారా తక్షణ అనుమతులు (Instant approvals) లభించనున్నాయి. ఇకపై భౌతికంగా అధికారులు స్థలాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉండదు.
Building Permissions | ఈ నియమాలు పాటించాలి
ఈ మార్గదర్శకాలు 4,000 చదరపు మీటర్ల లోపు ఉన్న నివాస ప్లాట్లకు మాత్రమే వర్తించనున్నాయి. పట్టణ స్థానిక సంస్థలు (ULBs) మరియు పంచాయతీలు, శాసనపరంగా UDAs పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలు కానున్నాయి. అయితే రాజధాని ప్రాంతానికి ఇవి వర్తించవు. అనుమతుల కోసం బాధ్యత పూర్తిగా LTPs (Licensed Technical Persons) మరియు ప్లాట్ యజమానులపై ఉంటుంది. వారు నిబంధనలు పాటించకపోతే, చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఈ కొత్త విధానం ద్వారా ప్రజల సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా, అవినీతిని నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడనుందని మున్సిపల్ పరిపాలన శాఖ అంచనా వేస్తోంది. SCS 2025 అమలుతో భవన అనుమతుల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది.
ఇప్పటికే ఐదు అంతస్తుల లోపు నిర్మాణాలకి సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమల్లో ఉండగా, తాజాగా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేయని ప్రభుత్వం.. తాజా ఉత్తర్వులలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతించిన వైట్ కేటగిరి పరిశ్రమలకి సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేస్తూ పలు మార్పులు చేసింది.
500 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో నిర్మించే వైట్ కేటగిరి పరిశ్రమలకు (Industries) ఇది వర్తిస్తుందట. భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాల నివారణతో పాటు జాప్యం తగ్గించడం, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం ప్రధాన లక్ష్యం.