అక్షరటుడే, వెబ్డెస్క్ : Vice President election | ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (Vice Presidential Candidate CP Radhakrishnan) బుధవారం నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు.
జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 21 వరకు నామినేషన్ వేయడానికి గడువు ఉంది. ఎన్డీఏ తన అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్గా (Governor of Maharashtra) కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఆయన నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రెటరీ జనరల్కు నామినేషన్ పత్రాలు అందించారు.
Vice President election | సెప్టెంబర్ 9న ఎన్నిక
ఉపరాష్ట్రపతి ఎన్నికను (Vice Presidential election) సెప్టెంబర్ 9న నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ చేపడతారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చించారు. అయినా కూడా ఇండియా కూటమి తమ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్రెడ్డిని (Justice Sudarshan Reddy) ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ వేయనున్నారు. బుధవారం ఆయన విపక్ష ఎంపీల సమావేశంలో పాల్గొననున్నారు.
Vice President election | ఎన్డీయే అభ్యర్థి విజయం ఖాయం
ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో (Lok Sabha and Rajya Sabha) ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో ఆ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సులువుగా విజయం సాధించనున్నారు. బలం లేకున్నా విపక్ష కూటమి అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం. అయితే రాధాకృష్ణన్ నామినేషన్ వేయడానికి ముందు పార్లమెంటు కాంప్లెక్స్లో ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించారు. కాగా.. రాధాకృష్ణన్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా, జార్ఖండ్, తెలంగాణ గవర్నర్గా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు.
Vice President election | వారి ఓటు ఎటో..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గెలుపు ఖాయమైనట్లే. అయితే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలు ఎవరికి ఓటు వేస్తాయనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు ఒక్కటే అని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిగా ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన వ్యక్తిని నియమించడంతో ఆయనకు మద్దతు ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వైసీపీ ఇప్పటికే ఎన్డీయేకు మద్దతు ప్రకటించింది. బీజేడీ, అన్నాడీఎంకే లాంటి పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయో చూడాలి.