అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Elections | బీహార్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ (NDA) భావిస్తుండగా.. జేడీయూ, కాంగ్రెస్ కూటమి సైతం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కీలక ప్రకటన వచ్చింది.
బీహార్లో మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా.. 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ బీజేపీ (BJP), జేడీయూ (JDU), ఎల్జేపీ(ఆర్), ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం కలిసి పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు పలు పార్టీలు జత కట్టాయి. ఈ క్రమంలో ఆదివారం ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, జేడీయూ సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి.
Bihar Elections | బీజేపీ, జేడీయూ సమానంగా..
బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సమాన స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బీజేపీకి 101 సీట్లు, జేడీయూ 101, LJP(R)కి 29, ఆర్ఎల్ఎంకి 6, హెచ్ఏఎంకి 6 సీట్లు కేటాయించారు. చాలా కాలం పాటు జరిగిన చర్చల అనంతరం అన్ని పార్టీలు ఈ సీట్ల పంపకానికి ఓకే చెప్పాయి. బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్, జేడీయూ నేత సంజయ్ ఝా ఈ మేరకు సోషల్ మీడియాలో సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేశారు. బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
Bihar Elections | సీట్లను వదులుకున్న జేడీయూ
గత ఎన్నికలలో సీట్ల పంపకాలతో పోలిస్తే జేడీయూ 14 సీట్లు, BJP 9 సీట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లలో LJP కి ఏ సీట్లను వదులుకోకూడదని జేడీయూ మొదట భావించింది. అయితే చర్చల అనంతరం వెనక్కి తగ్గింది. సీట్ల పంపకాల జేడీయూ నాయకుడు సంజయ్ ఝా మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను భారీ మెజారిటీతో తిరిగి ఎన్నుకోవడానికి దృఢ నిశ్చయంతో మరియు ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలు కలిసి బీహార్లో మహాఘటబంధన్ పేరుతో పోటీ చేయనున్నాయి. అయితే అవి ఇంకా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.