అక్షరటుడే, వెబ్డెస్క్ : Vice President Election | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు బల ప్రదర్శనలో భాగంగా భారతీయ జనతా పార్టీ (BJP) న్యూఢిల్లీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఎంపీలందరికీ రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహించింది.
వర్క్షాప్ ఆదివారం ప్రారంభం కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొన్నారు. ఆయన చివరి వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. చివరి వరుసలో కూర్చున్న ప్రధాని ఫొటోలను పార్టీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రధానమంత్రి మోదీ ఇతర నాయకులతో పాటు చివరి వరుసలో కూర్చున్న ఫొటోను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ‘ఎక్స్’ లో చేసిన ఫొటో వైరల్గా మారింది.
Vice President Election | ప్రధానిపై ప్రశంసలు
బీజేపీ ఎంపీ రవి కిషన్ కూడా ఈ ఫొటోను షేర్ చేసి, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ఎన్డీయే ఎంపీల వర్క్షాప్లో చివరి వరుసలో కూర్చోవడం బీజేపీ బలం. ఇక్కడ, ప్రతి ఒక్కరూ సంస్థలో కార్యకర్త” అని ఆయన హిందీలో రాసుకొచ్చారు.
Vice President Election | కీలక అంశాలపై అవగాహన
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవడం, 2027 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వైపు..’ అనే రెండు కీలక అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరుగనున్న ఈ వర్క్షాపులో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించనున్నారు. వర్క్షాప్ ప్రారంభం సందర్భంగా జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) తీసుకొచ్చినందుకు NDA నాయకులు ప్రధాని మోదీని సత్కరించారు.
Vice President Election | ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ సెప్టెంబర్ 9న జరుగుతుంది. పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అదే రోజు ఫలితం ప్రకటించనున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీలో ఉండగా, ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది. ఎన్నికల్లో గెలవాలంటే 392 ఓట్లు అవసరం. ఎన్డీయేకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 130 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే కానుంది.
