అక్షరటుడే, వెబ్డెస్క్: Narendra Modi Assam Visit | ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ (Congress) పట్టించుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశం బాగుకోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదన్నారు.
ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఆ పార్టీకి తెలిసింది అవినీతికి పాల్పడటం ఒక్కటే అన్నారు. అసోంకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగ్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అస్సాం (Assam)లో అస్థిరత ఉండేదన్నారు. బీజేపీ దానిని మార్చిందని చెప్పారు. కాంగ్రెస్ మరోసారి అస్సాంను అశాంతిలోకి నెట్టాలని కోరుకుంటోందని ఆరోపించారు. మరోసారి చొరబాటుదారులకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటోందన్నారు. ఢిల్లీలోని దాని అగ్ర నాయకత్వం, అస్సాం నాయకులైనా చొరబాటుదారులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Narendra Modi Assam Visit | అమరులకు నివాళులు
ప్రధాని మోదీ 2019 పుల్వామా ఉగ్రదాడి (Pulwama Terror Attack)లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిర్వహించిందని గుర్తు చేశారు. ఉగ్రవాద బెదిరింపులకు ప్రతిస్పందించడంలో భారతదేశం తన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిందన్నారు. గతంలో పుల్వామా దాడి సమయంలో సైతం సైన్యం ధీటుగా స్పందించిందన్నారు. కాంగ్రెస్ నుంచి దీనిని ఆశించగలరా అని ప్రశ్నించారు.
Narendra Modi Assam Visit | కార్యకర్తలే బలం
బీజేపీ (BJP) సంస్థాగత బలాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ ఘనత కార్యకర్తలకే దక్కుతుందన్నారు. తమ కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేస్తారని, అందుకే పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను బీజేపీ కార్యకర్తను అని గర్వంగా చెబుతానని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ (Union Budget)లో అస్సాంకు పన్ను వాటాగా రూ. 50 వేల కోట్లు లభిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. బడ్జెట్ ఈశాన్య ప్రాంతాన్ని ఆర్థికంగా స్వావలంబన చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు. అస్సాంలో హైవేలు, రోడ్డు ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించామన్నారు.