అక్షరటుడే, వెబ్డెస్క్: Nara Lokesh Dinner Meetings | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ప్రజాప్రతినిధులతో మరింత సమన్వయం పెంచేందుకు ఆయన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLA), ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన లోకేష్, వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే డిన్నర్ మీట్స్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచే అమలులోకి రానుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పార్టీ ప్రజాప్రతినిధులతో నేరుగా మమేకమవడం, వారి సమస్యలు, స్థానిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవడం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Nara Lokesh Dinner Meetings | ప్రత్యేక కార్యక్రమం..
అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) సమయంలో ప్రతి రోజూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో నేతల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా ముచ్చటించనున్నారు. అలాగే నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ డిన్నర్ మీట్లో కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత బలాన్ని పెంపొందించడమే కాకుండా నాయకత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సమావేశంలో మొత్తం 17 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్), ఆ తర్వాత అరగంట జీరో అవర్ ఉంటుంది. ఉదయం 10.30 నుంచి 11 వరకు విరామం ఇవ్వగా, తిరిగి 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సభ కొనసాగుతుంది. అవసరమైతే మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించవచ్చు.
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సెలవులు ఉండగా, 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు ఎనిమిది పనిదినాల్లో డిమాండ్లు, గ్రాంట్లపై చర్చలు చేపట్టనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండగా, మార్చి 4, 5 తేదీల్లో సప్లిమెంటరీ అంచనాలు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. మార్చి 6, 7 తేదీలను ప్రభుత్వ బిజినెస్ కోసం రిజర్వు చేశారు.