అక్షరటుడే, వెబ్డెస్క్ : Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చిత్రాన్ని వాట్సప్ డీపీగా ఉపయోగించి అమాయకులను మోసం చేసిన ముఠాలోని మరో ఇద్దరు సభ్యులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) కొండాపూర్లో ఉంటున్న గుత్తికొండ సాయి శ్రీనాథ్ (A-2), చిత్తడి తల సుమంత్ (A-3) లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండూరి రాజేశ్ను ఈ ఏడాది జనవరి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఐడీ అధికారులు (CID Officers) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ రాష్ట్రాల్లో 9 కేసుల్లో మొత్తం ₹54.34 లక్షలు దోచుకున్నట్లు తేలింది.
Nara Lokesh | ఆర్థిక సాయం పేరుతో మోసం
రాజేశ్, సాయి శ్రీనాథ్, సుమంత్లు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సైబర్ మోసాలకు (Cyber Fraud) పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో #HelpAtNaraLokesh, #HelpAtPawanKalyan వంటి హ్యాష్ట్యాగ్లతో పోస్టులు చేసి, వైద్య చికిత్సల కోసం సాయం కోరే వారి వివరాలు సేకరించేవారు. అనంతరం అమెరికా నంబర్లా కనిపించే వర్చువల్ నంబర్లతో బాధితులకు వాట్సప్ ద్వారా సంప్రదింపులు చేసేవారు. తనను తాను టీడీపీ ఎన్నారై కన్వీనర్గా పరిచయం చేసుకున్న కొండూరి రాజేశ్, మంత్రి లోకేశ్ (Minister Lokesh) ఫొటోను వాట్సప్ డీపీగా ఉంచి బాధితులను నమ్మించేవాడు. ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి, నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి డబ్బు పంపినట్లు నమ్మించేవాడు. కొద్ది రోజుల తరువాత బ్యాంకు మేనేజర్ల పేరుతో కాల్ చేసి, “విదేశీ డబ్బు జమ కావాలంటే 4 శాతం రెమిటెన్స్ ఛార్జీలు చెల్లించాలి” అని చెప్పి డబ్బు వసూలు చేసేవారు.
ఈ మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ (Indian Cyber Crime) కో-ఆర్డినేషన్ సెంటర్ టోల్ఫ్రీ నంబర్ 1930కి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. ప్రధాన నిందితుడు కొండూరి రాజేశ్ Rajesh, అరెస్ట్ కాకముందు గోవా, అండమాన్, ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్కు పారిపోయి అక్కడి నుంచే నేరాలు కొనసాగించాడు. తరువాత పశ్చిమ బెంగాల్లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు, 15 రోజుల రెక్కీ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. రాజేశ్ పట్టుబడిన తర్వాత సాయి శ్రీనాథ్ మరియు సుమంత్ ఫోన్లు, సిమ్కార్డులు మార్చేసి గత 10 నెలలుగా దాక్కుని ఉన్నారు. వారిపై నిఘా కొనసాగించిన సీఐడీ అధికారులు చివరకు వారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే దానిపై దృష్టి సారించారు.

