అక్షరటుడే, వెబ్డెస్క్ : Satya Sai District | ఆంధ్ర ప్రదేశ్ (AP)లో దృశ్యం సినిమా తరహా హత్య జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేయగా.. రెండేళ్ల తర్వాత కేసు మిస్టరీ వీడింది.
తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా (Meena) జంటగా నటించిన దృశ్యం, దృశ్యం–2 సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ యువకుడు వెంకటేశ్ కూతురు స్నానం చేస్తుండగా వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు. దీంతో మీనా ఆ యువకుడి తలపై కొట్టగా చనిపోతాడు. ఇలాగే బ్లాక్మెయిల్ చేసిన ఓ వ్యక్తిని మహిళ భర్త మరో ఇద్దరితో హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.
Satya Sai District | మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ (Nalla Cheruvu PS) పరిధిలో 2023లో అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆయనకు సంబంధించిన వివరాలు ఎలాంటి క్లూ దొరకకపోవడంతో రెండేళ్లుగా కేసు అలాగే ఉండిపోయింది. ఇటీవల అమర్నాథ్ హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Satya Sai District | అసలు ఏం జరిగిందంటే?
ఓ మహిళ స్నానం చేస్తుండగా అమర్నాథ్ వీడియో తీశాడు. అనంతరం కోరిక తీర్చాలని ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. లేదంటే వీడియో బయట పెడతానని బెదిరించాడు. ఈ వషయాన్ని సదరు మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో ఆయన మరో ఇద్దరితో కలిసి అమర్నాథ్ను హత్య చేశాడు. అనంతరం నిందితులు మృతదేహాన్ని చర్లోపల్లి చెరువులో పడేశారు. తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.