అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Municipal Election Shock | జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు బీజేపీ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Municipal Election Shock | ఆ రెండు పార్టీలకు వైరాగ్యం..
మానాల మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లు తీవ్ర వైరాగ్యంలోకి వెళ్లిపోయి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు. రాబోయే రెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) సైతం మన్సిపాలిటీలన్నీ తమవేనని బీరాలు పలికారన్నారు. ఎన్నికల తర్వాత పూర్తిగా చతికిలబడ్డారని ఎద్దేవా చేశారు.
Municipal Election Shock | కామారెడ్డిలో..
మతసామరస్యానికి చిహ్నంగా ఉన్న కామారెడ్డి (Kamareddy) లాంటి ప్రాంతాల్లో చిచ్చురేపే ప్రయత్నానికి బీజేపీ తెరలేపిందని మానాల ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నుండి ప్రజలను పక్కదోవ పట్టించడానికి పశ్చిమ బెంగాల్ తరహా అల్లర్లను కామారెడ్డిలో సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రానున్న పదేళ్లలో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత మిత్రులు కేసీఆర్, కేటీఆర్ (KTR)లతో కలిసి వచ్చినప్పటికీ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేదన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే సవాల్ విసిరితే దానిని స్వీకరించి ఆధారాలు చూపించేందుకు కాంగ్రెస్ నాయకులు వెళ్లారన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు ఇరువర్గాలను అదుపులో ఉంచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి అటువైపుగా వెళ్తుంటే బీజేపీ నాయకులు (BJP Leaders) ఆయన వాహనంపై దాడి చేశారన్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు.
Municipal Election Shock | ప్రశాంత్ రెడ్డికి మతిభ్రమించింది..
బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మానసిక స్థితిని కోల్పోయాడని మానాల ఎద్దేవా చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో నీళ్ల కోసం ఉద్యమం చేసిన మహిళలపై కేసులు పెట్టిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. భీమ్గల్లో తులం బంగారం గురించి అడిగితే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడని ఒక్కసారి ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. సమస్యలపై ఒక మంత్రిని ప్రశ్నించే పద్ధతి అదేనా అని మానాల నిలదీశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యం రెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు వైశాక్షి సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, జిల్లా ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, నగర కాంగ్రెస్ ఉపాధ్యడు సకినాల శివప్రసాద్, సాయికిరణ్, కౌశిక్ శివ తదితరులు పాల్గొన్నారు.
