అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితో జగిత్యాల (Jagityala)కు కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya) మంజూరైంది. కేంద్ర కేబినేట్ (union cabinet) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం .5,862 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యాలయాల్లో బాల వాటిక (ప్రీ ప్రైమరీ తరగతులు)లు ఉంటాయి. ఇందులో తెలంగాణకు నాలుగు మంజూరయ్యయి. జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి జిల్లాలకు విద్యాలయాలు మంజూరయ్యాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా రూరలం మండలం చెల్గల్లో, వనపర్తి జిల్లా నాగవరం శివారులో పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు.
MP Arvind | ఎంపీ అర్వింద్ కృషి
ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకు వస్తున్నారు. ఆయన గతంలో పలు రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ROB) మంజూరు చేయించారు. ఇందులో ఇప్పటికే పలు నిర్మాణాలు పూర్తికాగా.. నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్ వద్ద కీలకమైన ఆర్వోబీ పనులు సాగుతున్నాయి.
ఇచ్చిన మాట మేరకు ఎంపీ అర్వింద్ నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయించారు. ఇప్పటికే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం నగరంలోని వినాయక్ నగర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అలాగే నగరంలో నవోదయ విద్యాలయాన్ని సైతం ఎంపీ తీసుకొచ్చారు. తాజాగా తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు. కాగా నిజామాబాద్ నగరంలో ఇప్పటికే కేంద్రీయ విద్యాలయం ఉంది.