అక్షరటుడే, వెబ్డెస్క్ : Medak | వివాహేతర సంబంధం మోజులో పలువురు హత్యలు చేస్తున్నారు. తాత్కాలిక బంధాల కోసం కట్టుకున్న వారిని, కన్న వారిని కూడా చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో భర్తలను చంపుతున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కన్న బిడ్డలను చంపడానికి కూడా కొందరు వెనకాడటం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని వారణాసి (Varanasi)లో లో సోనాశర్మ అనే మహిళ తన ప్రియుడితో ఉండగా కుమారుడు చూశాడని హత్య చేసింది. మెదక్ జిల్లాలో సైతం ఓ మహిళ ప్రియుడితో కలిసి 25 ఏళ్ల కుమారుడిని హత్య చేసింది. పది నెలల తర్వాత ఈ విషయం వెలుగు చూసింది.
తూప్రాన్ (Toopran) మండలం వెంకటాయపల్లికి చెందిన రహేనాకు సిద్దిపేట జిల్లా వర్గల్ (Wargal) మండలం మక్త మైలారం గ్రామానికి చెందిన జహంగీర్తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అహ్మద్ పాషా జన్మించారు. కుమారుడు రెండేళ్ల వయసులో ఉండగా.. జహంగీర్ మృతి చెందాడు. దీంతో రహేనా వెంకటాయపల్లిలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందాల భిక్షపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కుమారుడికి తెలయడంతో తల్లిని మందలించారు. దీంతో తన కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
Medak | హత్య చేసి.. వాగులో పడేశారు
భిక్షపతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రహేనా ఐదేళ్లుగా కాళ్లకల్ గ్రామంలో నివాసం ఉంటుంది. 2024 నవంబర్ 27న ప్రియుడితో కలిసి రహేనా కుమారున్ని బైక్పై తూప్రాన్ పరిధిలోని ఆబోతుపల్లి శివారులోకి తీసుకువచ్చింది. ఇద్దరు కలిసి అహ్మద్ పాషా(25)కు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉండగా.. తాడు, చున్నీతో గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హల్దీ వాగు (Haldi Vagu)లో పడేశారు.
Medak | ఇలా చిక్కారు..
ఆబోతుపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో నవంబర్ 28న గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే యువకుడి మిస్సింగ్ గురించి ఎవరు ఫిర్యాదు చేయలేదు. దీంతో పది నెలలుగా కేసు విచారణ ముందుకు సాగలేదు. అయితే మృతదేహం దొరికిన సమయంలో పోలీసులు ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోస్టర్లు అతికించారు. ఇటీవల ఆ పోస్టర్లో మృతదేహాన్ని గుర్తించిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో మృతుడి వివరాలు పోలీసులకు తెలిశాయి.
తన కుమారుడు అదృశ్యం అయినట్లు అహ్మద్ పాష తల్లి ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కొడుకును చంపినట్లు ఆమె ఒప్పుకుంది. రహేనా, ఆమె ప్రియుడు భిక్షపతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.